మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై నారా లోకేశ్ స్పందన!

  • వైసీపీ భయపెట్టినా టీడీపీ సైనికులు ఎన్నికల బరిలోకి దిగారు
  • పార్టీ గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డారు
  • ఈ ఫలితాలతో నిరాశకు గురి కావద్దు
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల అయినా జయకేతనం ఎగురవేయాలని ఆశించిన టీడీపీకి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ మాట్లాడుతూ, పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు.

ఎన్నికల్లో గెలుపు కోసం రాత్రనక, పగలనక పని చేసిన నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. నామినేషన్ వేస్తే చంపేస్తామని వైసీపీ నేతలు భయపెట్టినా భయపడక టీడీపీ సైనికులు ఎన్నికల బరిలోకి దిగారని ప్రశంసించారు.

వైసీపీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను ఆపేస్తామని బెదిరించి ఈ ఎన్నికలను నిర్వహించారని లోకేశ్ విమర్శించారు. ఈ ఫలితాలతో టీడీపీ శ్రేణులు నిరాశకు గురికావద్దని అన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉందామని, ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగిద్దామని పేర్కొన్నారు. ప్రజలకు అండగా నిలిచి, వారికి మరింత చేరువయ్యేందుకు కృషి చేద్దామని అన్నారు.

Nara Lokesh
Telugudesam
Municipal Elections

More Telugu News